గౌతమి

గౌతమి
Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Friday, December 18, 2020

మోక్షసాధనకు మార్గం మార్గశిరం- ఆదివారం వార్త మేగ్జీన్_డిశెంబర్ 13, 2020

 మార్గశిరంలో వదులుకోవాల్సినది పొందాల్సినది

***************************************************
నేను వ్రాసిన వ్యాసము పోయిన ఆదివారము 'వార్తా' వారి సౌజన్యంతో. ధనుర్మాస ప్రియులందరకూ చిన్న వ్యాసకానుక మరియు శుభాకాంక్షలు. మనందరిపై గోదాదేవీశ్రీరంగనాధుల కటాక్షవీక్షణాలు ప్రసరించాలని కాంక్షిస్తున్నాను. అందరికీ నమస్కారం.






Monday, February 10, 2020

"మాలిక" అంతర్జాల మాస పత్రిక జనవరి-2020 సంచికలో నా వ్యాసం_ ||భక్తి మాలిక తిరుప్పావై||


ఆధ్యాత్మికం
.
|| భక్తి మాలిక తిరుప్పావై ||

.
BY EDITOR · JANUARY 1, 2020 maalika.org
.
రచన: శ్రీసత్య గౌతమి
.
కడలిలో మహానదులు కలిసిపోయేట్లు విష్ణుభక్తి అనే కడలిలో నిరంతరంగా సాగే అలే “గోదా”. విష్ణుభక్తిని చిత్తము నందు ధరించిన భట్టనాధుడికి ఆ భక్తే తులసీవనాన ఒక పాపగా దర్శనమయ్యింది. ఆ పాపే, విష్ణుచిత్తుడు బిడ్డగా పొందిన “కోదై (తులసి మాల)”. ఆమె యే ఈ “గోదా”. నిరంతర విష్ణుభక్తి కలబోసిన వాతావరణం లో పెరిగిన గోదా, కృష్ణతత్వాన్ని శోధిస్తూ ప్రణయతత్వం అనే నావలో ప్రయాణం మొదలుపెట్టి అచంచలమైన ఆరాధనా, భక్తి, విశ్వాసాలతో శ్రీరంగనాధుడిని వశపరుచుకున్నది. ఆ శ్రీరంగనాధుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయి మోక్ష్యానికి ప్రణయారాధన ఒక సాధనమని లోకానికి చాటి చెప్పినది గోదాదేవి. అంతేకాదు ధనుర్మాస వ్రతాన్ని ఒక నోములా తాను చేపట్టి తన చెలికాండ్రతో కూడా చేయించినది. ఆ విధానాన్నంతా ముప్ఫై పాశురాలుగా ప్రబంధ కావ్యాన్ని రచించి మనకు అందించినది. భోగి పండుగ రోజున రంగనాధుని పెండ్లాడినది. ఆమె కళ్యాణము అయ్యాకే మనుజుల కళ్యాణాలు మొదలవుతాయి, అందుకే భోగి పండుగ భోగి మంటలకే కాదు, గోదా కళ్యాణానికీ ప్రసిద్ధి. తిరుపతిలో సైతం ధనుర్మాసం మొదలైన నాటినుండీ గోదాదేవి రచించిన ప్రబంధం ‘తిరుప్పావై’ (పాశురాలు) నే పాడుతూ స్వామివారిని సేవిస్తుంటారు.
.
పరమాత్మను చూడాలనుకొనే ఆత్మను కలిగివున్న వారికి ఒక వరంగా లభ్యమయ్యేదే ధనుర్మాస వ్రతదీక్ష. అట్టి వ్రతదీక్షను బూనినవాళ్ళెప్పుడూ ఆ గోదాదేవి ఆశీస్సులను పొందివుంటారు. గోదాదేవెలాగ తన చిత్తాన మహావిష్ణువును ధరించినదో అలా ఆ మహావిష్ణువును చిత్తాన ధరించిన ప్రతి ఒక్కరికీ పరమాత్మను చూడడం సులభసాధ్యమే అని తాను గోపీ వేషధారియై వ్రతమాచరించి, తన స్నేహితురాండ్ర చేత కూడా వ్రతమాచరింప జేసెను. తద్వారా ఆ వ్రత విధానాన్ని, నియమాలను లోకానికి 30 పాశురాలుగా తిరుప్పావై అనే పేరిట రచించి, అందించినది. భూమి మీద మనుజులందరూ తరియించాలనే సాక్ష్యాత్తు భూదేవే కోదై (గోదాదేవి) గా దక్షిణ తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునకు పాపగా అవతరించినది.
.
శ్రీకృష్ణ తత్వాన్ని శోధించి సాధించుకున్న గోదాదేవి జ్ఞానము, భక్తి, వైరాగ్యములనే ఆభరణాలను ధరించి, స్నేహితురాండ్రకు కూడా బోధిస్తుంది. అంత:కరణ స్నానమాచరించమంటుంది. ఆ నారాయణుడు ఇహ లోక సంపదలను ఇచ్చువాడే కాకుండా, ఆధ్యాత్మిక సంపదలను కూడా ఇచ్చువాడు. భూమి మీద పుట్టినందులకు అవసరాల నిమిత్తమూ ఇహ లోక సంపదలు అవసరం. వాటి సముపార్జనలో నిరంతరము మునిగి ఆద్యాత్మిక సంపదను ఆర్జించడం విస్మరిస్తే మనుజుడు పరమాత్మను చూడలేడు. అందుకోసం మనుజుడు తన ఆత్మనే రేపల్లె జేసి, అందు శ్రీకృష్ణుని నిలిపినప్పుడు తాను తప్పకుండా పరమాత్ముని చూడగలడనీ, అందుకు అంత:కరణ శుద్ధి (అనగా ఇహ లోక సంపదలను వదలడం) అవసరమని బోధించినది గోదా. అంతేకాదు, “ఇది భగవంతుని పొందాలనే ఆర్తితో చెయ్యాలసిన వ్రతమే తప్పా…ఇది ఒక సాధన కాదు, తపమూ కాదు, నిరంతరం సాగే సముద్రం అనీ, దానిలో పుట్టే అలలవలే భగవంతుని అనుభూతులు కలుగుననీ” వ్రత ఫలితాన్ని కూడా ముందుగానే సూచించినది ఆ తల్లి.
.
చేస్తున్న ప్రతి పనిలోనూ శ్రీకృష్ణుని దర్శించమంటుంది గోదాదేవి, ఆ విధంగా మనుజుడు మంచి పనులకే పూనుకొంటాడు గానీ, చెడుకి పూనుకోడు. అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా శ్రీహరికి అర్పిస్తున్నట్లు భావించమంటుంది ఎందుకంటే సర్వం విష్ణుమయం, ఆ మహావిష్ణువు అందరికీ ఇచ్చువాడు, ఆయనదే పైచెయ్యి. అట్టి మహావిష్ణువుకు అర్పించు చోట “నేను, నా వల్ల, నేను గాబట్టి” వంటి అహంకార, మమకారాలు మనుజునిలో పుట్టకుండా వుంటాయని వివరించినది గోదాదేవి. అంతే కాకుండా బాహ్య అలంకరణలకు (అనగా కంటికి కాటుక, తలలో పువ్వులు మొదలైనవి) దూరమవ్వమన్నది, ఆ పువ్వులను భగవంతునికే అర్పించమన్నది. దాని వలన, మాకేదీ వద్దు, నీవు తప్పా అనేటువంటి జ్ఞానంతో కూడిన భావన అలవరుతుందని బోధించినది. పెద్దలు చెప్పిన ఆచరణలను పాటించమనీ, ఇతరులపై చాడీలు చెప్పకూడదనీ, ఎప్పుడూ సత్యములనే పలుక వలెననీ, శక్తికి మించినదైనా అవసరమైనప్పుడు ఎదుటి వారికి సహాయము చెయ్యగల ప్రయత్నం చెయ్యవలెననీ పాశురములో నియమావళిగా చెప్పినది. దీనివలన అంతా నాదే అన్న భావన మనుజునిలో తొలగి, అంతా ఆ పై వాడిదే, నాదేమీ లేదన్న విషయాన్ని మనుజుడు గ్రహించగలడన్నది. నా ద్వారానే ఆ సర్వాంతర్యామి ఈ పనిని చేయిస్తున్నాడనే భావన కలుగును అని తన నియమావళి యొక్క ఆంతర్యాన్ని బోధించినది.
.
గోదాదేవి చెప్పిన మూడవ పాశురం ఆశీర్వచన పాశురం. ఆవిడ చేసిన శుభసంకల్పం. నెలకు మూడువానలు పడాలనీ, వరి చేలలోని చేపలు నిండుగా ఎగిరెగిరి పడుతుండాలనీ మరియు గోశాలలో పాలు సమృద్ధిగా వుండాలని. అంతే కాకుండా ఆద్యాత్మికంగా తానిచ్చిన గొప్ప సందేశమేమిటంటే ఆచార్యులు గోవుల్లాంటివారు. గోవులు పాలతో సమృద్ధిగా వున్నటుల, ఆచార్యులు జ్ఞానముతో సమృద్ధిగా వుందురు కావున వారిని అనుసరించి జ్ఞానాన్ని పొందమన్నది. బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల భూదానమడిగిన నెపముతో అతని నుండి అహంకారము, మమకారము, అవిద్య (అజ్ఞానము) ను తొలగించి పాతాళానికి నొక్కి, బలికి వాటినుండి మోక్షాన్ని ప్రసాదించాడు వామనుడు. అలాగే ఆ పరమాత్ముని సహాయంతో అహంకార, మమకార, అజ్ఞానాలను తొలగించు కోవడానికి ఆచార్యులను ఆశ్రయించమని మరొక నియమాన్ని బోధించినది.
.
ఈ వ్రతమాచరించుటకు మరొక ముఖ్యమైన నియమము “అనసూయ” గా వర్ధిల్లడం అనగా అసూయను రూపుమాపుకోవడం. ఇతరుల సౌఖ్యాలను చూసి ఓర్వ లేకపోవడమనే లక్షణాన్ని పూర్తిగా తొలగించుకోమంటుంది గోదాదేవి. అది ఈ వ్రతం ద్వారా ఎటుల అలవరుననిన, తాను వ్రతాన్ని అంత గొప్పగా చెయ్యలేక పోయినా తనతోటి వారెవరైనా ఈ వ్రతాన్ని సమృద్ధిగా చేయుచున్నప్పుడు అసూయ చెందకుండా, నిండు మనసుతో హర్షించడం గోదాదేవి నేర్వమంటుంది. అది ఎడారా, మెట్ట భూమా, నందనవనమా అనే తేడా లేకుండా ఆ మేఘుడు అంతటా ఎలా వర్షించునో మన మనస్సుకూడా తన, పర బేధాలు లేని… అంత నిశ్చలతను పొంది వుండాలనే నియమాన్ని పెట్టింది.
.
ఇలా స్నేహితురాండ్రకు మంచి విషయాలను బోధిస్తూ గోప వేషధారియైన గోదాదేవి మహావిష్ణువున్న దివ్యదేశాన పరమాత్మలో లీనమయ్యున్న పదిమంది ఆళ్వారులను గోపికలుగా భావిస్తూ వారందరినీ వ్రతము ఆచరించుటకు ప్రతిదినమూ పిలుచుచున్నది. స్నేహితురాలు “శుభ కర్మలను చేయు చున్నప్పుడు ఆటంకములు సహజము. అలా మనము వ్రతదీక్షలో చవి చూచెదమేమో” అనే ఆలోచనను వ్యక్తము చేసినది. అప్పుడు గోదాదేవి ఇటుల చెప్పదొడంగెను. “చేయు పనులలోనే కాదు, ఆలోచనలో కూడా కీడు శంకించ రాదు, అదే అవరోధము గా పనులకడ్డమగు”నన్నది. మొదటి గోప కిశోరము, కర్మలలో మూడు కర్మలుగా ఇమిడి వున్న సంచిత, ప్రస్తుత, ఆగామి కర్మలను వివరించి భగవంతుని అనుగ్రహం తో చెడు కర్మలు తొలుగునంటుంది అనగా చెడు ఖర్మలను తొలగించుకొనినా, ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని అర్ధము అని ఒక గోప కిశోరమంటే, పూర్వ జన్మలో ఏమి చేసినా, ఈ జన్మలో శుభకర్మలను చేయవలెనన్న జ్ఞానాన్ని తప్పకుండా కలిగి వుండాలి, అసత్యము లాడకుండా ధర్మాన్ని పాటించు తోడనే భగవంతుని అనుగ్రహము కలుగునని మరొక గోప కిశోరము చెప్పును. ఈ గోష్ఠి ద్వారా “మనసా, వాచా, కర్మేణా ఆ నారాయణునకు ఆత్మార్పణము గావించునప్పుడు, అన్ని చెడు ఖర్మలు తొలగుననీ, ఆ పరమాత్నుని వద్ద ఎల్లప్పుడూ చిన్మయానందమే వుండునని, ఇదియే శరణాగతి రహస్యమని” చెప్పినది గోదాదేవి.
.
జీవుడిని యోగ్యుడిని చేసి పరమాత్మునికి అందించే వాడు ఆచార్యుడు. అలా గోదాదేవి యే ఆచార్యునిగా కూడా వ్యవహరించి, గోపికలందరినీ లేపి తన గోష్ఠిలో కూర్చో బెట్టుకొని, వ్రతాన్ని ఆరంభిద్దామనుకొంటుంది. సూర్యోదయానికి ముందు పక్షుల కిల కిలా రావాలను వర్ణిస్తూ, ఆ సమయానే తెల్లటి విష్ణు శంఖము “విష్ణు సేవకు వేళయింది, రండి రండని ఆ పక్షులను పిలుచుచున్నది…అలానే మనలనూ పిలుచుచున్నది లెండు లెండని…” విష్ణుసేవకు గోపికలను పిలిచెడిది ఆ గోదాదేవి. “ప్రకృతి మనకిచ్చిన అహంకార, మమకారాలనే విష పదార్ధాలను, పూతన విషస్తన్యాలను పీల్చేసినట్లు ఆ శ్రీహరే హరించును. శకటాసురుని వంటిది మన దేహము, అది అహంకార, అజ్ఞానములనే చక్రములపై నడుచును. ఆ చక్రముల కీళ్ళను విరగ గొట్టగలవాడే ఆ మహావిష్ణువు, యోగ నిద్రలో వుండి ప్రపంచానంతా వీక్షించుచున్నాడు, అట్టి శ్రీహరిని, సేవింతము రండు రండనీ…” గోదాదేవి ఎలుగెత్తి గోపికలను పిలిచినది. శ్రీహరి గుణాలను శ్రవణము ద్వారా, కీర్తన ద్వారా వింటూ పాడుతుండేటప్పుడు లోపలి నుండి మార్పు సంభవిస్తుందనే సూత్రమును తెలిపినది గోదాదేవి. రేపల్లెలో గోపికలు నిరంతరమూ కృష్ణ తలంపుతో పట్టుదలగా చల్ల చిలుకుతూ అతని పై భక్తి విశ్వాసాలను సాధించి అమృతమైన వెన్న రూపములో శ్రీకృషునిని పొందారు, అటులనే మనమునూ శ్రవణముతో, ధ్యానముతో శ్రీకృష్ణుని పొందెదము రమ్మనెను గోపకిశోరాలను. మూడవ గోపిక, పిలిచిన వెంటనే రాదు. తన భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ కృష్ణుడే తన చెంతకు వచ్చుననే ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటుంది. అట్టి గోపిక తప్పకా తమతో వుండాలని కాంక్షిస్తూ వుంటారు గోదా మరియు ఆమె స్నేహితులు. కోరికలను పూర్తిగా వదిలేసి, ఎవరు ఆత్మలో పరమాత్మను పొందుతారో వారిని “స్థితప్రజ్ఞులు” అని అంటారు. అట్టి స్థితప్రజ్ఞతను కలిగి వుండి, ధ్యానంలో మునిగి పోయిన నాల్గవ గోపికను లెమ్మంటారు గోదా అమ్మవారు. ఆమె చుట్టూ దీపాలు, అగరువత్తులు వెలుగుతూ వుంటాయి, ఆమె ధ్యానంలో వుంటుంది. దీపము జ్ఞానానికీ, అగరొత్తుల సువాసన ఆ జ్ఞానం యొక్క అనుష్ఠానానికి నిదర్శనం. శ్రీకృష్ణ ధ్యానంలో పొందే జ్ఞానంతో స్థితప్రజ్ఞతను కలిగి భగవదనుభవ ఆనందాన్ని పొందేటప్పుడు, ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమవుతుందనీ, ఈ గోపిక ద్వారా ఆ తల్లి మనకు తెలియపరుస్తుంది. ఆ పై ఐదవ గోపిక వద్దకు పోయి “నోము నోచి భగవంతుని పొందిన ఆనందసాగరాన సుఖమును అనుభవిస్తున్న ఓ గోపికామణీ … తలుపును తెరువుము, తలుపు తెరవుకన్నా ఫర్వాలేదు, శ్రీసూక్తులను మాకు చెప్పుమ”ని ఆ ఆండాళ్ళు తల్లి కోరినది. “కుంభకర్ణుని వలె యోగ ధ్యానంలోనే వుండక, మా చెంతకొచ్చి నీ శ్రీసూక్తములతో మాకు జ్ఞానాన్ని ఒసగి వ్రతమును ఆచరింపజేయుమ”ని తల్లి కోరినది అనగా ధర్మశాస్త్రాలు తెలిసిన ఆచార్యుని వలెనే జ్ఞానము కలుగునని గోదాదేవి సూచించినది. శ్రీకృష్ణుని పై అనేక తిరునామములను పాడుతూ ధ్వని చేస్తూ లేపబోయినా, లేవకుండా కృష్ణ ధ్యానములో మునిగిపోయివున్న ఆరవ గోపిక మహా సౌందర్య లహరి. ఒక్క దోషమైననూ లేని గొప్ప వంశాన పుట్టి ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొనుట వల్ల ఆమె మరింత సౌందర్యవంతురాలయినది. ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని తమకు కూడా పంచి తమచే వ్రతాన్ని ఆచరింప జేయుమనీ, గోదా గోపికలు వేడుకున్నారు. అటు పిమ్మట ఏడవ గోపిక వద్దకు పోయి ఆమె మొద్దు నిద్దర (కృష్ణ ధ్యానము) చూచి, గోవుల పాల పొదుగుల నుండి ప్రవాహంలా స్రవిస్తున్న పాలలా సాగి పోతున్న ఆమె కృష్ణ మంత్ర ధ్యానమును స్నేహితురాండ్రకు జూపి, కృష్ణ మంత్రమును విరామం లేకుండా జపించమనీ, అదియే జన్మకు సార్ధకతని వివరిస్తూ, ఆ గోపీ భక్తురాలి వాకిట నిలబడి “నీ కృష్ణభక్తి క్షీర సాగరాన మేమునూ తడిచి ముద్దయితిమి, ఇప్పటికైననూ ధ్యానము నుండి లేచి మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయుటకు సాయపడమని” కోరుతూ, శ్రీరాముని సుగుణాలను కీర్తించినది గోదా. ఆ పై రావణుని పది తలలను మట్టు పెట్టిన శ్రీరామ శౌర్యమును, బకాసురుని నోటిని రెండుగా చీల్చిన చిన్ని కృష్ణుని లీలామృతాన్ని కొనియాడుతూ ఎనిమిదవ గోపికాలలామను లేపిరి. ఆమె కనులు తెరిచి అంతలోనే శ్రీకృష్ణుని యెడబాటునోపలేక కృష్ణుని వెతుకుతుండగా ఆమె కన్నులు తామర పూవులపై అలసి వాలిన తుమ్మెదలయినవి. అందులకు గోదా తమతో కలిసి జలకాలాడి కృష్ణగోష్ఠితో సేదతీర రమ్మని పదే పదే వేడుకొన్నది.
.
యోగులనూ, మునులనూ, ప్రకృతి కాంతను సైతము భగవదారాధన కొరకు నడిపించగల తొమ్మిదవ గోపిక ఉష:కాల సూచనలను పూర్తిగా మరిచి తన యింట దిగుడు బావిలో విచ్చుకున్న తామర్లలో, కమలాలలో ఆ కమలనాధుడిని దర్శించుకుంటూ మైమరిచింది. గోదాదేవి ఆమెను మేలుకొలిపి “ఆ కమలనాధుడిని మధురమైన స్వరాన మేమూ నీతో కలిసి కీర్తించెదము, మా ఈ వ్రతం ఫలించగలదు, రావమ్మా…రా..” అని కొసరి కొసరి పిలుచుకొన్నది గోదాదేవి. అచ్చటి నుండి ఈ పూబోణులందరూ శ్రీకృష్ణ మురళీనాదంలో రవమై పోయిన పదవ గోపికా రమణి వద్ద ఆగి, గొల్లుమని నవ్వారు. ఆ శబ్దాలకు తృళ్ళి పడి బాహ్య ప్రపంచాని కొచ్చిన గోపికామణి, తలుపులకు గట్టిగా గడియలు పెట్టినట్లు ధ్వని చెయ్యవద్దని వారిస్తూ మరలా గోదా మరియూ ఆమె స్నేహితురాండ్రతో కలిసి శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను వింటూ వారి వ్రతాన్ని శుభప్రదం గావించ జేరినదిట. ఇలా భగవదానుభవాన్ని ఏకాంతంగా ఒక్కరే అనుభవించకుండా పదుగురితో కలిసి పంచుకోవాలనే విషయాన్ని ఈ వ్రతంలో వివరిస్తూ, శ్రవణ, మనన, ధ్యానాల ద్వారా భక్తి యోగాన్ని ఎలా అనుసరించాలో గోపికలను తట్టి లేపుతూ మన కోసం పాశురాలను లిఖించినది ఆ తల్లి గోదాదేవి. ఈ వ్రతం ద్వారా సాక్ష్యాత్తు ఆ భగవంతుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయింది. గోదాదేవి అణువణువూ శ్రీకృష్ణుని భక్తి సాగరాన తేలియాడినది. అతని పై ఆరాధనా, భక్తి, విశ్వాసాలనే దారంతో పూల మాలలను అల్లి భగవంతుని మెడలో చేర్చినది. అతనిని చేరే మార్గాన్ని కూడా తిరుప్పావై కావ్య రూపాన రచించి తానే ఒక భక్తి మాలిక అయిన సుందర చైతన్య మూర్తి, మోక్ష ప్రదాయిని గోదాదేవి.

Saturday, November 2, 2019

ఆయన మనల్నాడించడంలేదు...మనమే ఆడుతున్నాం.

జీవులు శరీరమనే ఉపాధి ని భగవంతుని కృపతో పొంది, ఆ ఉపాధి ద్వారా కాలానికి అనుగుణంగా దానికి బద్ధులై ప్రారబ్దాలను పూర్తిచేసుకొని వెళ్ళిపోతారు. దీంట్లో కాలానికి వున్న ప్రాముఖ్య్తత అత్యంతం. ఎందుకంటే కాలాయాపన జరిగినా, కాలం దాటిపోయినా ఆ ప్రారబ్దాన్ని పూర్తిచేసుకోవడానికి అంతరాయం కలిగినట్లే. మళ్ళీ ఆ కాలం కలిసిరావడానికి ఎన్ని జన్మలు పట్టచ్చో...చెప్పలేం. మళ్ళీ ఆ కాలం వచ్చునో లేదో??? అది మళ్ళీ ఫిక్సుడు డిపాజిట్ లో పడుతుంది. అట్టి కాలాన్ని సాధన ద్వారా గుర్తించి ఈ శరీరమనే ఉపాధి సహాయంతో ప్రారబ్దాలను పూర్తిచేసుకోమనే శరీరాన్ని శివుడు మనకు ప్రసాదించాడు. ఈ సౌలభ్యం ఇతర జీవరాశులకు లేదు.
.
84 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమిమీద ఉన్నాయి. మట్టిలోపలే పుట్టి, మట్టినే తింటూ, మట్టిలోనే పెరిగి, మట్టిలోనే చచ్చిపోయే జీవికి కనీసం వెలుగుని చూసే అవకాశంవుండదు. మట్టిలోనే వుండే దానికి కళ్ళు అవసరం లేదు, కాబట్టి దానికి కళ్ళులేవు ఇహ దానికి వెలుగెందుకు? మట్టిలో వుండే ఈ జీవికి మెదడు ఇవ్వబడలేదు, అది దైవం గురించి ఆలోచించదు. మట్టిలోపల చీకట్లో వుండే ఆ జీవికి ఊర్ధ్వముఖంగా చూసే భాగ్యముండదు ఎందుకంటే కళ్ళులేవు. కాబట్టి ఈ జీవికి ప్రారబ్దాలను మొయ్యడమే తప్పా...వాటిని తొలగించుకొనే అవకాశం మట్టిలోవుంటుండగా లేనేలేదు. అది పొందాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు మానవజన్మకు ఎదురుచూడాల్సిందే.
.
క్షీరదాలలో ఎలుకలువున్నాయి, మనిషివున్నాడు అంత మాత్రం చేత మనిషి, ఎలుక ఒకటి కాదు. ఎలుక అడ్డంగా పెరిగే జంతువు, మనిషి ఊర్ధ్వముఖంగా పెరుగుతాడు, తనకన్నా ఎంతో ఎత్తును చూస్తాడు, సాధన ద్వారా భగవంతుని చూడగలిగే, చేరుకోగలిగే భాగ్యము కేవలం మానవునికి మాత్రమే వుంది. ఎలుకకు లేదు. అలాగని ఏనుగు ఎత్తుగా పెరుగుతుందికదా, ఏనుగుకుందా అని ప్రశ్నవెయ్యొచ్చు. ఏనుగు సేవలను అందించే భాగ్యాన్ని పొందింది. ఎలుకకు ఆ భాగ్యమూ లేదు. ఇలా జంతువులకు లేని భాగ్యాలెన్నో మానవుడికిచ్హాడు ఆ పరమాత్ముడు, తనను గుర్తించమని. అయినాసరే మానవుడు ఆ పని చెయ్యకుండా కుడితిలో పడ్డ ఎలుకలా ఇహలోక సౌలభ్యాలలో కొట్టుమిట్టాడుతూ కాలాయాపన చేస్తే ఆ మానవుడికే నష్ఠం. కనీసం ఇతరులెవరైనా సత్యాన్ని గ్రహించి తమదారిలో తాము సాధన చేసుకుంటున్నప్పుడు నీచ ఎలుకల్లా, పనికిరాని బొద్ధింకలా, పట్టిపీడించే చెదపురుగుల్లా పాడుచెయ్యకూడదు. దీనివల్ల వారికి కాలాయాపన జరిగి నష్ఠపోతారు గనుక, ఆ నష్ఠానికి వీరు బాధ్యులయి మరుజన్మల్లో మానవరూపమున్నా నికృష్ఠులుగా, లోకకంఠకులుగా చెదపురుగు మరియు నీచంగా కలుగుల్లో పెరిగే ఎలుకల లక్షణాలతో పుట్టగలరు. ఇట్టివారు ఊర్ధ్వముఖంగా పెరిగినా, భగవంతుని చూడలేరు, క్రింద మట్టిపురుగువలెవుందురు. తమమలమూత్రాలతోనే ఒకదాన్నిమరొకటి గుర్తు పట్టుకొని బ్రతికే ఎలుక గుంపుల్లా జీవించెదరు, పుష్ఠికరమయిన చెట్లను తినేస్తూ బ్రతికే చెదలా జీవించెదరు. ఈ జీవరాశుల్లాగే మానవళికేమాత్రం ఉపయోగంలేని నిర్భాగ్యపు జీవితాలు జీవించెదరు. ఇలా ఎన్నో..ఎవరిలోనయినా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే శిక్ష అనుభవిస్తున్నారని అర్ధం.
                                                 
ఇదే కాలానికున్న మహిమ. నాడు నువ్వు ఒకరికి చేసేదానికి వెంటనే శిక్షపడకపోవచ్చు, కాలం ఎప్పుడోకమారు ఏదోకరూపంలో ప్రతీకారం తీర్చుకుంటుంది. కనీసం అప్పుడు నువ్వు తెలుసుకున్నాకూడా -సన్నని సాలెపురుగు ప్రోగులాంటి సహాయాన్ని నీకందించి క్రిందపడకుండా ఆ పారిజాతన్ని రక్షించినట్లు రక్షిస్తాడు ఆ దేవుడు. లేకపోతే ఇంతే సంగతి.
.
నరకం ఎక్కడో లేదు!
.
Gauthami Jalagadugula
.
Picture- Google courtesy. Not mine.

Thursday, April 5, 2018

మానవధర్మాలను విత్తనాలుగా నాటి ...



బాబా దగ్గిర ఎప్పుడూ తోడూ-నీడగా ఒక ఇటుక తన వెంబడే వుండేది. అది ఒక భక్తునియొక్క చేతిలో విరిగిపోగా బాబా గారు నొచ్చుకుంటూ అనిన మాటలివి. "ఇది నా తోడూ నీడ ఈరోజువరకు. దీనివల్లే నేను నన్ను అన్ని ఆత్మలతోనూ అనుసంధానమయివున్నాను, ఇది ఇప్పుడు ముక్కలయిపోయింది". నాటి రోజునుండి ఆయన ఏదో ఒక సంధర్భంలో తన నిష్కృమణ (ఈ లోకం నుండి) గురించి చెబుతూనే వున్నారు భక్తులకు అర్ధం కాని రీతిలో. తన సన్నాహాలను చేసుకుంటూనే వున్నారు, భక్తులకు విధులను అప్పజెప్పుతూ, అభయాలను వొసంగుతూ వున్నారు. గబ గబా తాను అనుకున్న పనులను సూచనలిస్తూ చేయించారు. బాబాగారు ఒక అనుభవం నమ్మినవారికి.
.
తన ఆత్మను ప్రతి ఆత్మలోనూ అనుసంధానం చెయ్యగలగడం దైవాంశ సంభూతం. ఒక పుణ్యమానవాత్మమకు దైవాంశాలు లభ్యమవ్వడం యోగులకు, గురువులకు మాత్రమే జరిగే వ్యవహారం. బాబాగారు బాల బ్రహ్మచారి గా సన్యాసించారు. భిక్షాటన ద్వారా జీవించడం సన్యాస ధర్మం. కానీ ఈ సన్యాసి ఏ కొండాలోకో కోనల్లోకో లేక ఏ అద్భుతమైన దేవాలయాల్లోకో పోయి తపస్సు చేసుకుంటూ మహిమలు చూపలేదు. ప్రతి ఇంటితోనూ తాను సంబంధం పెట్టుకున్నాడు, మనుష్యుల అజ్ఞానాన్ని పారద్రోలి, వారి మనస్సులను పరమాత్మ వైపుకు తన ద్వారా మళ్ళించడం తన కర్త్వ్యం గా చేసుకున్నాడు. బీదా, బిక్కిని ఆదరించాడు. వారికి భోజనం పెడుతూ వారిలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేశాడు. దానికి తానే ఒక సేవకుడయిపోయాడు. తన ఆత్మను ఎల్లప్పుడూ భగ్వన్నామ స్మరణలో ఉంచుతూ ఇంద్రియాలపై స్పష్ఠతను ఏర్పరచుకొని వాటిని అదుపులోవుంచుకున్నాడు. ఇది కేవలం బాహ్యానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా అంతర్ముఖులైన వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని, కష్ఠమయిన పని. అది యోగ్యులయిన యోగులకే సాధ్యం. అది దైవ సంకల్పం. ఆ దేవుడు ఇచ్చేవరం.
.
ప్రతి ఆత్మతోనూ అనుసంధానం మయి ... వాటి అవసరాలను తెలుసుకొని అవి తీరుస్తూ ప్రజలకు కనిపించాడు తద్వారా ప్రతి ఆత్మ ఏకాత్మా అని అందులో పరమాత్మ గలడని చూపించాడు, అంతే కాకుండా ప్రతి ఆత్మ (అనగా మనిషి) మరో ఆత్మను (జంతువులతో సహా) ఎలా ఎందుకు భూతదయ కలిగివుండాలో తను పాటించి అందరికీ చూపించి, మానవధర్మాలను విత్తనాలుగా నాటి, దానికి నీళ్ళుపోసి చెట్లను చేసి ఆ కొమ్మల నీడలో బ్రతకమని తన సగుణ రూపాన్ని చాలించాడు. నిర్గుణ రూపంలో వుండి ఇంకా కాసుకుంటానని మాటిచ్చాడు. ఇవన్నీ పరమాత్మ లీలలు. తన లీలలను పండించుకోవడానికి ఆయన ఎన్నో అవతారాలను సృష్టిస్తాడు, మనకు కనువిప్పు చేస్తాడు. అటువంటి అద్భుతమైన దైవ సృష్ఠి సద్గురు షిరిడీ సాయిబాబా.



Saturday, February 10, 2018

శివతత్వం-ప్రేమమయం


శివరాత్రి ఉపవాస, జాగరణా దీక్షాపరులకు-12 తేదీన న రాత్రి 10 తర్వాత త్రయోదశి విచ్చేసి, 13 న రాత్రి 12 వరకు. ఆపై చతుర్దశి-14 వ తేదీ అంతా వుండును రాత్రి 2.16 వరకు- దీక్ష విరమించుటకు. 
.
కొంతమంది చతుర్దశి దాటకుండా దీక్ష విరమించాలంటారు, మరి కొంతమంది చతుర్ధశి కూడా పూర్తయ్యాకే దీక్ష విరమించాలంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు 13.14 తేదీలు లేదా 13 వ తేదీ చేసుకొని తరించండి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొనండి.
.
అది అక్కడికి కట్ చేస్తే... ఆనాటి (కాలేజ్ డేస్) నా జాగరణ రహస్యం- ప్రత్యేకంగా జాగరణకు మన సమరసింహం బాలకృష్ణ సినిమాలను ఎంచుకొనేవాళ్ళము. ఎందుకంటే ఆయన డాన్సులు, డైలాగులు బ్రెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసి కంటిరెప్పల్ని ఆపేసి కంటిచూపుని నిలబెట్టేవి. దానితో జాగరణ అత్యద్భుతంగా పూర్తయ్యేది. ఈ సంవత్సరం ఏం చేస్తానో చూడాలి.
.
సరే ... దాన్నక్కడికి కట్ చేస్తే- శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. ఆ సదాశివుని కృపవుండడంవల్ల మాత్రమే నేను వ్రాయగలిగిన ఒక ఆర్టికల్ "శివతత్వం-ప్రేమమయం" _2018 శివరాత్రి సంధర్భంగా-
.
తప్పక చదువగలరు. తప్పులుంటే మన్నించగలరు. మీ అందరకూ శివరాత్రి శుభాకాంక్షలు.






Friday, January 5, 2018

సంకష్ఠహర చతుర్ధి


సంకష్ఠహర చతుర్ధి అంటే సంక్లిష్ఠాలను హరించే చతుర్ధి అని అర్ధం. విఘ్నాలను, సంక్లిష్ఠాలను తొలగించే దైవం శ్రీ మహాగణపతి. చతుర్థి అనగా నాలగవరోజు ఆ మహాగణపతి రోజు. ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇది ప్రతినెలా జరుపుకొనే గణపతిపూజ. జనవరి 2018 లో శుక్రవారం 5వ తేదీన వచ్చ్నది, మరలా ఫిబ్రవరి 3వ తేదీన ఈ పూజ జరుపుకొనవచ్చు. అలా ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి సంకస్ఠహర చతుర్ధి. తమిళనాడులో దీనిని సంకటహర చతుర్ధి అంటారు. ఇటువంటి చతుర్ధి మంగళవారనాడు పడినప్పుడు అంగారకి చతుర్ధి అంటారు. ఈ చతుర్ధి ని భారతదేశంలో నలుమూలలా చేసుకుంటారు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు.
.
పూజావిధానం:
***********
చతుర్ధిరోజున రోజంతా ఉపవాసముండాలి. ప్రొద్దున్నే లేచి లార్డ్ గణేశాకు నిత్యపూజ గావించుకోవాలి. ఉపవాసముండాలి, సాయంత్రం నైవేద్యాలతో, స్తోత్రపఠనాలతో పోఅజపూర్తి చేసుకోవాలి. సాయంత్రం చంద్రుని చూసి, ఆయనకు కూడా పూజా నైవేద్యాలు సమర్పించి, ఆ తర్వాత గణపతిని ధూప, దీప, నైవేద్యాలతో, అష్ఠోత్తర, సంకష్ఠహరస్థోత్రాలతో స్తుతించాలి. కొంతమంది పూర్తి ఉపవాసము కాకుండా ఒక్కపూట ఉపవశిస్తారు, శాఖాహారం మాత్రమే భుజిస్తారు. అది కూడా గణేష  పూజ అయిపోయాక మాత్రమే ఆహారం తీసుకోవాలి. గణపతి మోదకప్రియుడు గనుక తప్పకుండా మోదకాలను సమర్పించాలి. ఆపై ఆయనకిష్ఠమైన పళ్ళు, కాయలను సమర్పించుకోవచ్చు. పూజలో దూర్వాన్ని వాడాలి.
.
ఈ పూజయొక్క విశిష్ఠత ఏమనగా- శివుడు ఈరోజునే గణపతిని గణాధిపతిని చేశారు. గణపతికి మరోపేరు సంకష్ఠి. ఈపూజ చేసుకొన్నవారికి స్వేచ్చ, ఆరోగ్యం, సంపద, అదృష్ఠం కలుగును. ఈ పూజను శ్రీకృష్ణుడు యుధిష్టరునికి కూడా సూచించెను. దీని గురించి సంపూర్ణంగా భవిష్యపురాణం, నరసింహ పురాణాల్లో కూడా వ్రాయబడివున్నది.
.
క్రింది గణపతులు అమెరికాలో హూస్టన్ నగరంలో విలసిల్లుతున్న మీనాక్షీ టెంపుల్ లోని మహాగణపతి హోమశాల లోని విగ్రహ చిత్రాలు.






Sunday, November 6, 2016

తుది నిర్ణయం తనదే!!!


మన సహాయం ఎవరైనా అర్ధిస్తే, తప్పక చేయడంగానీ, లేక చేయించడం గానీ మన ధర్మమని షిరిడీ సాయినాధులవారు చెప్తుండేవారు. వారుగూడా యీ ధర్మం పాటించారు. ఒకప్పుడొక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టరు త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, "నీవు నానా చందోర్కర్ తో కలసి కణీత్కర్ తో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టరు అది మంజూరు చేశాడు. అతడుబావి త్రవ్వించుకొని, పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు.
                                                                   -శీ సాయిలీలామృతము
                                                                     అధ్యాయము-9_ఉపదేశాలు విభాగము
                                                                     రచన: ఆచార్య శ్రీ యక్కిరాల భరద్వాజ

"ఈ ధర్మం వారు కూడా పాటించారూ" అంటే గుర్తొచ్చింది. అది నిజమే. నా స్వానుభవం కూడా. 2013 లో అమెరికాలో పున:ప్రవేశం చేసినప్పుడు ఒక తెలుగు కుటుంబం (ఇంతకు మునుపు కాస్త తెలిసినవారు) తో ఇంకాస్త పరిచయం పెరిగింది. వాళ్ళు సాయి భక్తులని అప్పుడే తెలిసింది ఇంకాస్త పరిచయంలో. ఇంతలోనే వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. నేనుండే అపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ ఇల్లు చాలాదూరం కూడా, కాకపోతే పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఉంది వాళ్ళ ఇంటికి దగ్గిరగానే. దగ్గిరలో దిగి, ఇంటికి నడుచుకొని వెళ్ళాలి. అప్పుడే పున:ప్రవేశం చెయ్యడంవల్ల నేనింకా కారు కొనలేదు అప్పటికి. అందువల్ల ఎక్కడ తిరగాలన్నా దగ్గిర ప్రాంతాలకే పరిమితమయ్యాను. కాని ఏం విచిత్రమో ... అంతదూరంలోవున్న వీళ్ళ ఇంటి గృహప్రవేశానికి మాత్రం దీక్షబూనినట్లు కష్టమయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ తీసుకొని ... లోకల్ టైన్స్ మిస్ అయినా కూడా ... గంటల సేపు నిరీక్షించి మరీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. భార్యా భర్తలిద్దరూ ఆయా కార్యక్రమాల్లో కూర్చొనివున్నారు, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. ముఖ్యంగా ... వారికి ఇతర అతిధులు వచ్చి వున్నా అందరిలోకి నన్నే పూజారి కూడా పిక్ అప్ చేసి వాళ్ళ ఇంట్లో మనుష్యులకి చెప్పి చేయించేటట్లుగా కొన్ని విధివిధానాలను నా చేతులమీదుగా చేయించారు. నేను కూడా ఏమాత్రం కూడా తడబడకుండా చక చకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసాను. అయితే జస్ట్ అంతకు మునుపే నా స్వంత ఇంటి శంకుస్థాపన కార్యక్రమాలు నా చేతులమీదుగా చేసివున్నానుకోండి. అయితే అది వీళ్ళకు తెలియదు కదా, అందులోనూ పూజారిని అదే మొదటిసారి కలవడం, కాబట్టి చాన్సే లేదు నాకున్న ప్రాక్టీస్ గురించి. దీని వెంటనే అలా వాళ్ళు సాయిబాబా పూజ చేసుకొంటే దానికీ ఒక ముఖ్య అతిధిగా వెళ్ళడం జరిగింది. ఇదంతా అయ్యాక, నాకే చాలా ఆశ్చర్యం వేసింది... ఈ ప్రయాణ ప్రయాసలకోర్చి నేనేనా అంత దూరం వెళ్ళినది అని? తర్వాత అప్పుడే అనుకున్నాను బాబాగారి లీలమృతంలో ఎన్నో కధలున్నాయి. 

                                          (పైన చూపబడిన చిత్రం గూగుల్ నుండి)
ఉదాహరణకు ఎక్కడో తన భక్తుల ఇంట వారి బిడ్డ ప్రసవవేదన పడుతుంటే అక్కడ వారా బాధలో తనని తలచినంతనే తన వద్ద కూర్చొన్న మరో భక్తుడికి విభూతినిచ్చి ఆమెకిమ్మని చెప్పి పంపుతారు. అలా తన భక్తుల ఇంట్లో అవసరానికో, ఆపదల్లో ఉన్నప్పుడో ... సర్వజ్ఞుడిగా అన్నీ ముందుగా తెలుసుకొని సమయానికి తన మరో భక్తులని పంపి వారి అవసరం తీరుస్తారని. ఎవరి అవసరాలు ఎలా తీరాలో తానే నిర్ణయించి ఆదేశిస్తారని. ఆ రెండు కార్యక్రమాల తర్వాత ఆశ్చర్యంగా మేము మళ్ళీ ముఖాముఖి కలుసుకునే అవకాశం ఏర్పడలేదు. కాని ఆ సమయం లో మాత్రం చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్లే వెళ్ళాను. తన భక్తులని ఎప్పుడు, ఎలా కనెక్ట్ చెయ్యాలో తెలిసిన ఏకైన జ్ఞాని ఆ సద్గురువే. బాబాగారు అనేవారుట ... నా భక్తుల పూర్వజన్మ సుకృతం మేరకు వారు నన్ను కనుక్కునే తీరుతారు, వాళ్ళ వద్దకు నేనే వెళతాను లేదా ఏదైనా కోరికల (మానవ జన్మకు అది సహజవిధానము) మేరకు వారే నన్ను సమీపించి అక్కడినుండి నాతో అడుగులు వేస్తారని.

ఈ వేళ లీలామృతాన్ని పారాయణం చేస్తుంటే కరెక్ట్ గా ఎక్కిరాలవారు రచించిన ఆ పాయింట్ల దగ్గిరకి వచ్చేటప్పుడు 2013 లోని ఈ సంఘటన గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా సద్గురువు యొక్క సందేశమే ఈ లీలామృత పారాయణం. హటాత్తుగా కూర్చొబెట్టి చదివిస్తున్నారు ఒక ముఖ్య విషయార్ధమై.
.

శ్రీ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై!

Friday, August 12, 2016

నేనూ- నా వరలక్ష్మీ పూజ...

ఆగస్ట్ 12, 2016

ప్రతి సంవత్సరం అలవాటయిన షోడ శోపచార పూజ... ఎంత అలవాటున్నా దానికి పట్టే టైము దానికి పట్టేస్తుంది, టైం లేదుకదా అని ఎంత కుదించాలనుకున్నా పెద్దగా కుదరదు... ఎందుకంటే అసలు వ్రత విధానం సాధారణం గా క్లుప్తంగానే ఉంటుంది, పైగా తెచ్చుకునే వస్తువులు కూడా సింపుల్ వే. ఏముంటాయండీ మహా అయితే ఒక పదీ, పన్నెండు వస్తువులు.

1. పండ్లు
2. పూలు
3. ఆకు,వక్క
4. పంచామృతం
5. రవిక (కుదిరితే చీర కూడా)
6. గంధం
7. అక్షితలు
8. తోరాలు
9. నైవేద్యం
10. అగరొత్తులు
11. కొబ్బరి కాయలు
12. హారతి కర్పూరం

కానీ ఇంటి శుభ్రం, వంటి శుభ్రం, పూజా సామాగ్రి తోమడాలు, కలశం, బొట్లు పెట్టడం, నైవేద్యాల తయారీ, తోరాలు చెయ్యడం ... వీటికి టైం పడుతుంది. మన పెద్దలు మనకిలాగే నేర్పారు మరి. కానీ ఇల్లు, వొళ్ళు, పూజా సామాగ్రి శుభ్రాల్లో అప్ టు డేట్ గా వుంటే సగానికి పైగా పూజకోసం రెడీ అయినట్లే. దీనివల్ల పన్లను కొంచెం కుదించుకోవచ్చు. ఇక మిగిలేది కేవలం లక్ష్మీ పూజే.

ఇవాళ నా పరిస్థితి అయితే ఇంకా విచిత్రం. గత మూడు వారాలనుండి ఎడతెరిపిలేకుండా వర్క్ బిజీలో ఉన్న నేను సాయంత్రం 4.30 వరకూ తెలియదు శ్రావణ శుక్రవారం చెయ్యగలనని. తరువాతి శుక్రవారమే కుదరొచ్చులే అనుకున్నాను.

మూడు వారాలనుండీ ఎడతెరిపిలేకుండా చేస్తున్న వర్క్ కి, కత్తి లాంటి రిజల్ట్ రావడమే కాకుండా ... పెండింగులో ఉన్న మరికొన్ని పరిష్కరింపబడడమే కాకుండా ... ప్రొద్దున్న ఒక మంచి వార్త (వేరే యూనివర్సిటీ నుండి అహ్వానం- ఒక చిన్న సైజు "అంతర్జాతీయ కవి సమ్మేళనం లో వాళ్ళ యూనివర్సిటీ స్టూడెంట్ల కోసం పాల్గొనమని"- అదీ అమెరికా లో ... unbelievable !!!).

సాయంత్రం మరో మంచి వార్త (ఒక రీసెర్చ్ పేపర్ జర్నల్ కి యాక్సెప్ట్ అయ్యింది (హోరా హోరీ పోరాటాలు జరిగాయి రివ్యూయర్లతో)). ఆ పేపర్ కి  మెయిన్ వర్క్ చేసి దాని రూపానికొక మూలాధారాన్ని కల్పించాను.

ఇలా మంచి వార్తలు ముసరడంతో ... ఎక్కడ్లేని ఉత్సాహంతో చెలరేగింపు వచ్చేసింది. ఉన్నపళంగా నా డెస్క్ టాప్ మీదకి ఆవిడ వచ్చి కూర్చున్నారు.


ఇహ చల్... ఇక్కడ చేసింది చాల్లే అని ఇంటికి తరిమారు, ఫొటో చేతిలో పెట్టిమరీ !!! ఇహ కలశం, ఆవాహనం అదీ ఇదీ ...అని చెప్పే పనేముంది? ఏకంగా తానే వచ్చేస్తే. అంతే ఇంటికొచ్చేసరికి మా అమ్మాయి కూడా ...చక్కగా తలంటుపోసుకొనుంది, కనీసం ఒక్కసారికూడా నేను అరవలేదు, పంటికున్న బ్రేసెస్ నొప్పి అని అసలేమీ తినలేదు, ఆమెకది ఒక ఉపవాసంలా అయిపోయింది. అరిచే పని లేకపోవడం వల్ల నేను చేసుకొనే పన్లు ఇంకా తేలికయిపోయింది, చీకటి పడే లోపుల ఇలా పంచసంఖ్యోపచారం పూర్త్యిపోయింది,


మా అమ్మాయికూడా నాతో కలిసి అష్టోత్తరం పూర్తిచేసేసింది. కరెక్ట్ గా ఒక గంట... ఆవిడ తనకు కేటాయించేసుకుంది. తర్వాత మా అమ్మాయి పళ్ళనొప్పంటూనే తీపట్లు, పళ్ళు తినేసింది, హాయిగా ఉంది. భలే విచిత్రం.

ఈ సంధర్భంలో ఒక పురాణ కధ గుర్తొచ్చింది. దూర్వాస మహామునికి ఇంద్రుని ఆతిధ్యం నచ్చి ఒక విలువైన హారాన్ని ఇంద్రునికిచ్చాడట. ఆ ఇంద్రుడు దాన్ని తీసుకెళ్ళి ఐరావతానికి అలంకరించాడుట. ఆ ఐరావతం దాన్ని కాళ్ళ క్రింద వేసి, త్రొక్కి ముక్కలు చేసిందిట. అది చూసి మన దూర్వాసులు కోపించి ఇంద్రుడ్ని శపించాడుట, ఏమనీ? నీకున్న సర్వ సౌభాగ్యాల్నీ, రాజ్యాన్ని పోగుట్టుకో అని. అలాగే అన్నీపోయాయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక విష్ణువునాశ్రయించాడుట. విష్ణు "సర్వ సంపదలనూ ఇవ్వగలిగేది లక్ష్మే. కాబట్టి ఒక జ్యోతిని వెలిగించి, అది ఆవిడ స్వరూపంగా భావించి భక్తొశ్రద్ధలతో ప్రార్ధించి చూడు" అని అన్నాడుట. పాపం ఇండ్రుడు అలాగే చేశాడుట. అంతే దేవి ప్రసన్నురాలై పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి ఇంద్రుడిని మళ్ళీ నిలబెట్టిందిట.

అంతేకాదు తాను మోక్షం, విద్య, విజయం, సంతానం, సౌభాగ్యం, సంపద మొదలైన "న్యాయపరమైనవి " "భక్తిశ్రద్ధల" తో ఏమడిగినా ఇవ్వడానికే "వరలక్ష్మి" నై ఉన్నానని కూడా చెప్పిందిట.


ఇంద్రుని కధనుండి, నా కధనుండి  అర్ధమయిందేమిటంటే- అనుకోని విధంగా ఇరకాటంలో పడినప్పుడు సింపుల్ గా పూజచేసినా కూడా దేవీ దేవుళ్ళు ఏం ఫీల్ అవ్వరు, పైగా సహకరిస్తారు. అదీ దైవలక్షణం !!!

నాలాగా, ఇంద్రుడిలాగే కాకుండా మరేవిధంగా అయినా ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజచేసుకున్నా కూడా మీ అందరికీ ఆ వరలక్ష్మీ దేవి శుభాశీస్సులు !!!


Friday, April 15, 2016

సీతారాములకళ్యాణంచూతమురారండి!


చంద్రకాంతులు తేనెచుక్కలుగ మారి
దివి తారకలు గులాబీలుగ పేరి
మలయమారుతం సుగంధాలు వెదజల్లి
రంగరించిన రంగరింపు మా సీత
పన్నీటిజలకమాడి పుష్పాంజలి చేతబట్టి
స్వయంవరమునకరుదెంచె వరమాలతోడ
ఎందరో రారాజులు.. కాంచన సీతనుంగాంచి
మతిపోయి శ్రుతితప్పి శివధనుఁ విరువ తన్నలాడె

సీతమనస్సునెరింగిన శివధనస్సు వింటినారితో పలికె
ముదియ కోరిన మగడు శ్రీరాముడే రావలె ధనస్సు విరువ
వింటి నారి ధనస్సును కొంటెగా సైగ జేసి కిసుక్కున నవ్వి
రతీమన్మధులు సీతారాముల వైవాహిక సంభవానికి నాంది పలుక
ఎవ్వరు విరతురీ..శివధనస్సు..నా బోటి వింటినారినెక్కుబెట్టి



తలచినంతనే అరుదెంచె శ్రీరాముడు శివధనస్సు కడకు
క్రీగంట జూసె పూబాల సీతమ్మను వరమాలతోడ
చెయ్యిజాచి శివధనస్సును పేర్కొని శ్రీరాముడు ధనుర్భంగంగావించె
శ్రీరాముని చేతిస్పర్శకు వింటినారి ఒడలు పులకించె

ఆ ఉదుటున చిన్నారి సీత ఉల్లము ఊప్పొంగె
శ్రీరామునికి అంజలి ఘటించి వరమాల తో స్వయంవరించె
శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్య కేతెంచె..ఇక పెళ్ళి భోగొట్టా ఉరూరు వ్యాపించె
ఆ ఊరు, ఈ ఊరు ప్రతి ఊరు ముస్తాబించి పెళ్ళిపందిళ్ళు వేయించె
ఆణిముత్యాల తలంబ్రాల తో సీతారాముల మాంగల్యధారణ గావించె!









ఇమేజ్ లు గూగుల్ నుండి.

Thursday, November 12, 2015

షిరిడీ నివాసి సాయిబాబా ఎందుకు అవసరం మనకు?


మనకన్నా మనం ఆయనకే అవసరం. ఎందుకంటే నారుపోశాక నీరు పోయాలి కదా! బీజదశలో వున్నప్పుడు అదిమొలకెత్తడానికి అనువైన పరిస్థితులు చాలినంత ఉష్ణోగ్రత, కావలసినంత నీరు, పెరుగుదలకు అవసరమైన భూమినుండి ఖనిజలవణాలు కావాలి. ఇవన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతిలోనే ఎలాగూ లభ్యమవుతుంది. అయినా ఆ బీజం ఏ వాతావరణ వైపరీత్యానికో లోనయి అనుకున్న టైం కి మొలకెత్తలేకపోవచ్చు. మొలకెత్తినా మొక్క దశనుండి వృక్షదశలోకి అడిగుపెట్టేలోపుల మనుష్యులవల్లో, జంతువుల వల్లో అపాయానికి గురయ్యి ఏదో ఒక దశలో అదిరాలిపోవచ్చు. మరి దేవుని సృష్టిలో బీజం మొలకెత్తడానికి కావలసినవన్నీ ఉచితంగా దొరికినప్పుడు, అదే సృష్టిలో అది పెరిగి పెద్దవ్వడానికి అవాంతరాలు కూడా ఎందుకు వున్నాయి? ఇదే ప్రకృతిధర్మమా?
.
ఇదే ప్రకృతి ధర్మమయితే, ఇదే ధర్మం మానవజీవితాల్లో కూడా ఇలాగే ప్రస్పుటమవుతుంది. మనిషికి చిన్నతనం లో తానెటువంటి దశలో పెరుగుతున్నాడు, పెరిగాక ఏ దిశలో ప్రయాణించబోతున్నాడు, ఆ దిశ తాను కోరుకుంటున్నాడా లేక ఎవరైనా తనకి నిర్ణయిస్తున్నాడా? అది నచ్చని పక్షం లో అది మార్చుకోగలిగే శక్తి, యుక్తి తనకున్నాయా? ఉన్నా వాటిని ఉపయోగించుకొనే పరిస్థితిలో తాను ఉంటాడా? ఇలా ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో!!!
.
ప్రశ్నలు వేసుకున్నా మానవునికి అన్నీ తెలియని సమాధానాలే. అయినా మానవుడు దేనికీ భయపడకుండా, భయపడినా వేరే మార్గం లేకుండా ముందుకు వెళ్తూనే వుంటాడు. ఎక్కడా ఆగడు, అతనికోసం కాలం కూడా ఆగదు. మరి ఈ దిశని చూపించేదెవరు?
.
కొన్ని సమయాల్లో మానుషరూపేణా, కొన్ని సమయాల్లో తానే స్వయం గా వచ్చి దగ్గిరుండి నిర్ణయించే బాబాగారే. ఆయన స్వయం గా వచ్చినా, వేరే ఎవరినైనా పంపినా అది ఆ వ్యక్తికి అర్ధమయ్యేలాగే చేస్తారు. అందుకే “బాబా గారు ఒక అనుభవం”. ఆయనకు మనుష్యులయినా, జంతువులయినా, మొక్కలయినా ఒక్కటే. సమదృష్టి, సమానమైన భాధ్యత కలిగివుంటారు. ప్రకృతిధర్మాలకి లొంగవలసిన ఆవశ్యకత, అవష్థ ఆ ప్రకృతిలోని ప్రతి రేణువుకీ వుంది. జీవిత సమరంలోని వైవిధ్యాలన్నిటికీ లోనయి పోరాడి నిలవాల్సిన అవసరం మనిషికి వున్నా, లేకపోయినా నిలపాల్సిన అవసరం దేవునికివుంది, లేకపోతే సృష్టే లేదు. దాన్ని నడపడం కోసమే ఆయనకి మనం అవసరం. ఆయన అవసరాలకి కట్టుబడివుండాల్సిన అవసరం మనది. ఇలా మానవునిమీద దేవుడు, దేవుని మీద మానవుడు అధారపడి వుండాల్సిందే. కాబట్టి పాలమునిగినా, నీటమునిగినా అంతా నీదే భారం అని ఆయన మీద వదిలేయ్యడమే సమంజసం. అటువంటి మన:స్థితితో వున్న ఏ భక్తునికైనా తానే పరిగెత్తుకొని వచ్చి చెయ్యందించడం బాబాగారి ఆనవాయితి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


సాయిసచ్చరితము 25 వ అధ్య యనం లో చెప్పినట్లు తాను ధామూ కు ఎప్పటికప్పుడు వెన్నంటి వుండి తాను వ్యాపారంలో నష్టపోకుండా సలహాలిచ్చి కాపాడాడు. సంతానలేమితో బాధపడుచున్న ధామూ కు, తన దైవశక్తితో సంతానవంతుడిని చేశారు, హేమం త్ పంత్ నకు ప్రేరణ కలిగించి తన లీలల్ని పుస్తకరూపంలో వ్రాయించి భావితరాలకోసం పొందుపరిచేరు, తాను తనువు చాలించినా కూడా ఆత్మరూపంలో వుండి పలుకుతానని మాటయిచ్చారు, అలాగే ఎంతోమందికి లీలలు చూపిస్తూనే వున్నారు. ధు:ఖాలనుండి, అపాయాలనుండి రక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రారబ్దాలనుండివ్వెలికితీసుకొచ్చి ఒక మంచి ముగింపును కూడా ప్రసాదిస్తున్నారు. ఇవన్నీ మనకన్నా ఆయనకే అవసరం, ఎందుకంటే నారు పోశాక నీరుపొయ్యాలి, కంచె కట్టాలి, కాపాడాలి.. దాన్ని వృక్షాన్ని చెయ్యాలి. అలాగే మానవునికి కూడా కంచె కట్టాలి, ఉపద్రవాలనుండి కాపాడాలి, అతనిని స్థిరపరచాలి. దీనంతటికీ మానవుడు ఆయనకు సహకరించాలి. ఆయన చేసే సహాయాన్ని తీసుకొనగలిగే పరిస్థితిలో మానవుడు తన ఇంద్రియాలని, ఆత్మను శుద్దమయిన రీతిలో వుంచుకొని బాబాగారికి అంకితం చెయ్యాలి. అంతేగాని ఏమాత్రం కూడా బాబాగారి దారిలోకి వెళ్ళకుండా నాకేమి చెయ్యలేదని తిరిగి ఆయన్నే నిందించడం గాలిలో దీపం పెట్టడం లాంటిదే. చేతులారా జీవితాన్ని పెనుతుఫానులు చేసుకొని, అందులో కొట్టుకుపోతున్నప్పుడయినా ఆయన లేడు అని మూర్ఖం గా ఆలోచించకుండా దారి లో ఎక్కడోదగ్గిర కలుస్తారని భారం వేస్తే తప్పకుండా వచ్చే తీరుతారు, యనకది తప్పని పరిస్థితి!!


Saturday, August 22, 2015

కర్మ ఎవరిది????


ప్రతి మనిషి లో మంచి, చెడు వుంటుందంటారు. అంటే ఆ చెడు ఎటువంటి చెడు అయి వుండాలి? లోక కళ్యాణార్ధమయినదా? లోక కంఠకమైనదా?
.
అవసరాన్ని బట్టి మంచివాళ్ళే చెడ్డవాళ్ళుగా మారతారని చెప్తారు. అది ఎటువంటి చెడ్డతనమై వుండాలి? అది ధర్మ సంస్థాపనార్ధమై వుండాలా? లేక అధర్మ సంస్థాపన జరిగినప్పటికీ అది ఆపద్ధర్మం గానే భావించేసి, చెడు కి చెయ్యెత్తి జై కొట్టేయాలా?
.
కొంతమంది చెడు లో మంచిని వెతకాలంటారు. అది చెడు లేదా ఆ మనిషి చెడ్డ మనిషి అని ముందుగానే నిర్ణయం జరిగినప్పుడు, అందులో/వాళ్ళలో మంచి ఎలా కనబడుతుంది? అది కేవలం వాళ్ళలో దేన్నో ఆశిస్తూ చుట్టూ తిరిగే స్వార్ధ చింతన కాదూ??? ఆ స్వార్ధాన్ని, ఆ చెడు కూడా గుర్తించేసి కిసుక్కున నవ్వదు? ఆ చెడు, ఈ స్వార్ధాన్ని కాలి కింద చెప్పుచేసేసుకొని కోటలు కట్టుకొని బ్రతికెయ్యదు?????
.
స్వార్ధం తో అధర్మాన్ని పెట్టి పోషిస్తే చివరికి ఆ అధర్మమే భక్షిస్తుంది. 
.
లోకకళ్యాణర్ధమయినది నిస్వార్ధం, లోక కంఠకమైనదాంట్లో స్వార్ధ చింతన దాగివుంటుంది. స్వార్ధ చింతనతో రగిలిపోతూ వుండేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళమనుకొని వీళ్ళకి పాలు పోసి పెంచే తెలివైన పామరులు... తప్పక లోక కంఠకానికే దారి తీస్తారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్ల, వాళ్ళు పాలు పోసి పెంచే దుష్టపాముల వల్ల చెడు ని విస్తరిస్తారు. 
.
మరి ఒక మంచి వాడి వల్ల అనుకోకుండా చెడు జరిగి, అవసరాన్ని బట్టి ఒక మంచివాడు చెడ్డవాడిగా మారి వాడూ చెడు చేసి, చెడులో మంచిని వెతుకుతున్నానని చెప్పి మసి పూసి మారేడు కాయ చేసే స్వార్ధపరుడి వల్లా చెడు జరిగి... మరి ఈ మూడు రకాల చెడు పోషకుల పోషణలో పెరిగి వట వృక్షాలయిపోయిన అసలు సిసలైన నిఖార్సయిన చెడ్డవాళ్ళు (పుట్టుకతో) రాజ్యాలేలుతుంటే మరి మంచికి తలదాచుకోవడానికైనా చోటు దొరుకుతుందా???
.
మంచిని రక్షించేదెలా? ఎవరైనా వున్నారా? లేక అధర్మానికి తనకు తానుగా స్వభక్షణ జరిగినప్పుడే మంచి రక్షించ బడినట్లు అని అనుకోవాలా?? 
.
ఎంత విచిత్రం? దీన్నే కర్మ అంటారా? ఎవరికర్మ? పాపి చేత బాధింప బడే మంచిదా? పాపిగా పుట్టి పాపిగానే బ్రతికి చివరివరకూ కనీసం మారడానికి కూడా ప్రయత్నించకుండా ఒకవేళ మారాలన్నా ఏ స్వార్ధపు హస్తాలలోనే బంధీ అయిపోయి అలాగే బ్రతికే పాపిదా?
.
కర్మ ముగ్గురిది. 
.

* స్వార్ధ చింతనతో పాపి పంచన చేరిన స్వార్ధిది.
.
*చివరి వరకూ పాపి గానే ముగిసిపోయే పాపిది.
.
*మంచిని బాధిస్తూ, వేధిస్తూ పాపం మూటగట్టుకొనే పాపిది.

.
కాని, పాపి చేత బాధింపబడే మంచిది మాత్రం కర్మ కాదు. ఎందుకంటే మంచి పుట్టిందే పాపుల కర్మలు కాల్పించడానికి !!!
.
ముక్కుపచ్చలారని రామలక్ష్మణుల్ని యజ్ఞయాగాలను ఆపుతూ, ఎప్పుడూ దైవ ధ్యానం లో వుండే మునులను పట్టి పీడించే రాక్షస, భూత, ప్రేత, పిశాచాల్ని తుదముట్టించడానికి విశ్వామిత్రుడు అడవులకు తీసుకు వెళ్తాడు. 

.

మరి, ఎప్పుడు దైవధ్యానం లో వుండే మునులకు రాక్షస, భూతాల వల్ల నీచనికృష్టమైన చావులు రావడం ఏమిటీ? మునులు అనుకొనివుండచ్చు, ఎప్పుడూ యాగాలు చేసుకొనే మాకు ఈ "కర్మ" ఏమిటీ అని!

.
రాక్షస, భూత ప్రేతాల కర్మ కాలింది కాబట్టే మునుల జోలికొచ్చేరు. పాపాల కోటా పెంచుకున్నారు. ఒక్కసారి పాపాల పంట పండ గానే... రాముడొచ్చేశాడు, లయం చేశేశాడు!! ఈ లయం కార్యం లో మంచివాళ్ళు సమిధలు కాక తప్పదు.

Friday, July 31, 2015

గురుపౌర్ణమి విశిష్టత

ఆషాఢమాసం దక్షిణాయణ వర్షరుతువు తిధి పౌర్ణమి ని "గురు పౌర్ణమి" గా వ్యవహరిస్తారు,  ఆ రోజున అందరూ వారి వారి ఆధ్యాత్మిక గురువులను గౌరవించి పూజించడం ఒక ఆనవాయితీ. సాధారణం గా ఆధ్యాత్మిక గురువులను గౌరవించే రోజు ఈ “గురుసౌర్ణమి”.  స్కూల్ కి వెళ్ళి గురువు దగ్గిర నేర్చుకున్న విద్య మంచి, చెడుల విచక్షణని నేర్పి బ్రతుకు సాధనకు ఉపయోగపడుతుంది. కాని ఆధ్యాత్మిక గురువులు సంస్కారాన్ని, విజ్ఞతని, నేర్వబడిన విద్యా పరమార్ధాన్ని, జగతినంతా విస్తరించుకొని వున్న ఆ పరమాత్ముని లీలల ద్వారా బోధించే తత్వవేత్తలు. అందువల్ల బ్రతుకు బండిని నడిపించుకోడానికి అవసరమైన విద్యను నేర్పే గురువు ఎంత అవసరమో, విజ్ఞానాన్ని వికసింప జేయడానికి ఆధ్యాత్మిక గురువు కూడా అంతే అవసరం. ఇది కేవలం మానుస్య గణానికే కాదు, దేవ మరియు రాక్షస గణాలలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత కనిపిస్తున్నట్లు మన పురాణాలు, భాగవతాలు చెప్తున్నాయి. దీనికి ఒక ముచ్చటైన ఉదాహరణ- వినాయకుడు ప్రమధగణాధిపత్యాన్ని పొందేటప్పుడు తన తమ్ముడు కుమారస్వామి తో పోటీకి దిగుతాడు. పోటీ ప్రకారం కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి అతివేగం గా వెళ్ళి అన్ని పుణ్య నధుల్లో మునిగి వచ్చేస్తుంటాడు కాని మూషిక వాహనుడైన వినాయకుడు మాత్రం మెల్లగా నదీ స్నానాలు పూర్తి చేస్తూ, కుమార స్వామి వేగాన్ని అందుకోలేని పరిస్థితి లోవుంటాడు. అప్పుడు దారి చూపమని తల్లిదండ్రులని వేడుకొంటే తండ్రి శివుడు అధ్యాత్మిక గురువై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు...తమలోనే అన్ని పుణ్యనదులు, బ్రహ్మాండ కోటి జీవరాశులు నిండి ఉన్నప్పుడు మరెక్కడికో ఎందుకు వెళ్ళడం? తమ చుట్టూ ప్రదక్షిణలు చేసి పోటీ గెలవమని. వినాయకుడు నివ్వెరపోయి వారి చుట్టూనే ప్రదక్షిణలు గావించడం మొదలుపెట్టాడు. కుమారస్వామి కన్నా ముందు పుణ్య నదీ స్నానాలు ఆచరించేసి వినాయకుడు గణాధిపత్యాన్ని పొందాడు. ఇలా పురాణాలు తిరగేస్తూబోతే ఎన్నో కధలు కనబడతాయి అధ్యాత్మిక గురువు అంటే ఏమిటో తెలుసుకోవడానికి.



ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అనీ అలాగే వేదవ్యాసుని పుట్టిన రోజు గా కూడా పరిగణిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం వరాహ పురాణం లో చెప్పినట్లు గా విష్ణే “వ్యాసుడు” రూపం లో ప్రతి యుగం లో అవతరించి ధర్మ సూత్రాలను వెల్లడిస్తూ ధర్మం అదుపుతప్పకుండా నడిపిస్తూ వుంటాడు. అలాగే ద్వాపరం లో సాక్షాత్తు ఆ విష్ణే శ్రీ కృష్ణ అవతారం లో గీతా ధర్మాల్ని బోధించాడు. ద్వాపరాంతానికే ధర్మం కుంటడం మొదలుపెట్టింది. రాబోయే కలియుగం లో మరింత ధర్మ, జ్ఞాన, ఆచార భ్రష్టత్వాలకు లోనై ప్రజలు బ్రతుకుతారని గీతా ధర్మాలతో కృష్ణుడు, అలాగే వేద వ్యాసుడు కూడా జ్ఞాన బోధకుపక్రమించాడు. అందుకే వేదవ్యాసుడు ఆది గురువయ్యాడు. వేద వ్యాసుణ్ణి కూడా విష్ణవతారం గానే భావిస్తారు. వేద వ్యాసుడు మహా భారతాన్ని రచించిందే కాకుండా, అందులో తన పాత్రని కూడా చూపించుకుంటాడు. మహాభారతం  క్రీ.పూ. 3139 లో జరిగినది. దీనిని బట్టి వేద వ్యాసుడు ఈ కాలానికి చెందిన వాడని తెలుస్తున్నది.  కాని అంతకు మునుపెన్నడో వేదాలనేవి పుట్టినప్పుడు ఈయన ఏ విధం గా వేద వ్యాసుడయ్యాడు అనే ప్రశ్న రాక మానదు.

మహాభారత కాలానికి ముందునుండీ సరస్వతీ నది అనే మహా నది ఉత్తర భారతమంతా ప్రవహించేదట. ఆ నదీ సమీపాన ఎంతో మంది ఋషులు నివాసముంటూ వారు సముపార్జించిన విజ్ఞానాన్ని, సాధనలతో తెలుసుకున్న విశ్వ విజ్ఞాన్నీ, దైవరహస్యాలను శిష్యులకు పంచుతుండేవారు. మహాభారత సమయానికి కరువుకాటకాలొచ్చి సరస్వతీ నది 14 సంవత్సరాల పాటు ఎండిపోయినదిట. దానితో అక్కడినుండి నివాసాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందించిన  అపార విజ్ఞానము అక్కడితోనే మాయమవుతూ వచ్చింది. ఆ సమయం లో 14 ఏళ్ళ తర్వాత వేద వ్వాసుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మహా ఋషులు చెప్పి అక్కడే వదిలేసిన దైవ రహస్యాల్ని, జగత్తులో విస్తరించివున్నప్రాకృతిక రహస్యాల్ని,  దేవుని ఉనికిని తెలియపరిచే తత్వ బోధనలని పరిశోధించి, వాటిని సేకరించి ఆ సమాచారాన్ని వేదాల రూపం లో విభజించి జాబితా చేశాడు. ఆ వేదాలే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణవేదాలు. సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.




ఈ విశ్వమంతా ఒక పెద్ద పరిశోధనాలయం గా భావిస్తే ఈ వేదాలని వ్యసించిన (విభజించిన) వేద వ్యాసుడే కాదు సాధనల ద్వారా విశ్వాన్ని, ప్రకృతిని పరిశోధించి రహస్యాల్ని తెలుసుకొని అపారమైన విజ్ఞానాన్ని అందించిన ఆనాటి ఋషులు కూడా పరిశోధకులే. అలాగే మెటీరియల్ సైన్స్ ని శోధించి లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని కనుగొన్న ఐనిస్టీన్, ప్లేంక్ మొదలైన వారు, అలాగే ఇతర సైన్సులలోని వారు కూడా అందరూ పరిశోధకులే. వీరందరూ జగతిలోని ఏదో ఒక రహస్యాన్ని చేధించిన వారే. మరి వీరు చేధించిన వాటినన్నిటినీ సృష్టించినది ఎవరూ అంటే ఆ "దేవుడు" - కనిపించని మరోశక్తి, ఒక సెంట్రల్ పవర్ అని తీర్మానించక తప్పదు. ఈ సెంట్రల్ పవర్ హౌస్ ని అర్ధం చేసుకొని దేవునికి దగ్గిరవ్వడానికే ఆధ్యాత్మిక గురువు అవసరం. 

Thursday, January 15, 2015

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే !!!!

పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

బాబా గారు చెప్పినది: మరణసమయం లో ఉన్న కోరిక గాని, ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును మరు జన్మ లో నిర్ణయిస్తుంది.

భగవద్గీత (8వ అధ్యాయం) లో  శ్రీకృష్ణుడు చెప్పినదీ ఇదే. ఎవరైతే వారి అంత్యదశలో తనను జ్ఞాపకం ఉంచుకుంటారో, వారు తనను చేరుతారు. ఎవరైతే ఏదో మరోదానిని ధ్యానిస్తారో, వారు మరు జన్మలో దాన్ని పొందుతారు.

బాబా గారి మార్గాన్ని అనుసరించి యోగులైన వారి బోధనామృతం:

ఒక వ్యక్తి, ఒక స్త్రీ ని వివాహమాడి నానా ఇబ్బందులకు గురి అవుతుంటాడు. ఆ స్త్రీ వ్యసన పరురాలు మరియు నోటి దురుసు గలది.  స్వార్ధబుద్దితో, అహంకారం తో భర్తను తూలనాడుతూ బానిసను చేసుకుని బ్రతుకుచుండెను. ఏనాడూ ఆతనిని అనురాగముతో చూచెడిది కాదు. ఆతని కుటుంబీకుల మధ్య చూచుచున్నటుల నటించెడిది. తన ప్రవర్తనను ఎవ్వరికినీ చెప్పకూడదని భర్తను బెదిరించెడిది. తన పైననే ఆధారపడి ఆతను బ్రతుకునటుల చేసినది. తాను విటులతో చరిస్తూ, సుఖవ్యాధులపాలయి కొన్నాళ్ళకి మంచం పట్టి మరణించినది. ఆమె మరణానికి ముందు పిచ్చిది కూడా అయిపోయి భర్తని తిడుతూ, కొడుతూ అతని చేత అష్ఠాధి చాకిరీలు చేయించుకున్నది. చివరికి అతని కుటుంబీకులకు, స్నేహితులకు తెలిసి, అతని పరిస్థితులకు విస్తుపోయి, సహాయ సహకారాలందించ ప్రయత్నించిరి. అతనికి ఒక ఉద్యోగమును చూసి పెట్టిరి. ఇంతలో మరొక స్త్రీతో పరిచయమయి, అది ప్రణయం గా మారి వివాహానికి దారి తీసినది. ఈ రెండవ స్త్రీ ఎంతో అనురాగము తో చూసుకొనేది. అతని పూర్వపు జీవితానికి పూర్తి భిన్నం గా ఉన్నది ఈ రెండవ స్త్రీ తో. ఆమె అతని మనసుని నొప్పించకుండా గౌరవిస్తూ, దైవ భక్తి కూడా కలిగినది అయి... సంతోషముగా జీవించినది.

ఈ కధలో అతని మొదటి జీవితం.. అతని పూర్వ జన్మల కర్మల ఫలితము, ఒక వ్యసనపరురాలి క్రింద బానిస సంకెళ్ళు. కర్మానుసారె బుద్ది, కావున అ స్త్రీ ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు, బానిస బ్రతుకూ అనుభవించాడు..ఆ కర్మలు పూర్తయి సంకెళ్ళు విడిపోయినవి.  ఆ స్త్రీ యొక్క నీచ ప్రవర్తనకు దేవుడు వేసిన శిక్ష వ్యాధిగ్రస్తురాలయి, అందరిచేత చీ.. అనిపించుకుని, పిచ్చిది అయి, కుక్క చావు చనిపోయినది.

ఇక లభ్యమయిన రెండవ జీవితం.. బహుశా అదే అసలు జీవితం. ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం కావచ్చు లేదా పూర్వపు జన్మలో ని అతని సహచరిణి యే మళ్ళీ ఈ జన్మలో లభ్యమయి ఉండవచ్చు. మళ్ళీ సుఖ సంతోషాలతో, అనురాగం తో ఈ జన్మలోనూ జీవించి ఉండవచ్చు.

భక్తుని ప్రశ్న: పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

అవే పాప పుణ్యాల ఫలితాలు. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అలానే మరణ సమయము లో ఎవరిపైన ధ్యాసతో, వేదనతో ప్రాణం విడుస్తారో..ఆ అలోచనే, ఆ ధ్యాసే మరు జన్మలో భవిష్యత్తు అవుతుంది.

ఇక్కడ అతనికి లభ్యమయిన మొదటి స్త్రీ.. అతడు ఏఏ జన్మల్లోనో చేసుకున్న కర్మ ఫలం. రెండవ స్త్రీ అతని పూర్వ జన్మము నుండి తెచ్చుకున్న భవిష్యత్తు!  ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి జీవితంలో కనిపించిన విషయాలే. ఇందులో తప్పేదేముంది..అంటే ఏదీ లేదు. ఒక ఆత్మయొక్క గతమైనా, వర్తమానమైనా ఆ ఆత్మనే అంటిపెట్టుకునివుంటుంది. అది శరీరాన్ని త్యజించి మరో క్రొత్త శరీరం లోకి ప్రవేశించినా కూడా దాని గతాలు మళ్ళీ భవిష్యరూపంలో తటస్థిస్తుంది. మరణ సమయంలో ఏ వ్యక్తిపైననో, ఏ కోరికతోనో, ఏ ఆలోచనతోనో శరీరాన్ని త్యజించినా కూడా అది మరుజన్మలో పొందడం జరుగుతుంది. ఇదే మానవులకు అర్ధం కాని దేవుని లీలలు!!!!

భక్తుని ప్రశ్న: మరి ప్రతి జన్మలోని గతం తాలూకు నీలినీడలు.. క్రొత్త జన్మలలో ఏదో బ్యాంకు బాలెన్సు లాగ..సంప్రాప్తించి కర్మలకు గురి అవుతుంటే..భవిష్యత్తుని ఎప్పుడు సంపూర్ణం గా అనుభవించగలము?

అప్పుడు బాబా గారి దగ్గిరనుండి తరచూ వచ్చే ఒక క్లిష్టమైన సమాధానం చర్చించక తప్పదు.

బాబాగారు ఎప్పుడూ కష్టాలను ప్రేమించమంటారు. ఇదెక్కడి చోద్యం? ధు:ఖాన్ని కలిగిస్తున్నా కష్టాలని ప్రేమించగలమా? ఆయన అర్ధం ఏమిటంటే.. ప్రేమలో ఉండాల్సిన సర్వసాధారణ లక్షణాలు శ్రద్ద, ఓర్పు రెంటినీ కష్టం యందు పెంచుకోమంటారు. ఆరెండే.. ఆ కష్టం యందు అవగాహనని పెంచి ఎదుర్కోవడానికి దైర్యాన్ని, స్థైర్యాన్నిఇస్తుందంటారు. ఇక్కడ ప్రేమకున్న విలక్షణమైన గుణాలను వివరిస్తూ.. అటువంటి ప్రేమను, పడుతున్న కష్టం యందు వెచ్చించమంటారు. అప్పుడే ఆ కష్టం యందు అవగాహన కలిగి, దానిని సృష్టించిన వారియందుకూడా విచారణ శక్తి పెరిగి, శ్రద్ధ ఓర్పుతో సమస్యలను విడదీసి.. దైర్యం, స్థైర్యం తో ఎదుర్కొని కర్మలను పూర్తిచెయ్యగలరని చెప్తారు. ఇదంతా కేవలం ప్రేమతోనే సాధ్యం అంటారాయన. అందుకే బాబా గారికి "ప్రేమ సాయి" అని పేరు. ఆయన తన భక్తులని ప్రేమిస్తూనే వుంటారు, అంటే కేవలం వరాలివ్వడమేకాదు. కష్టాలతో కొట్టుమిట్టాడు తున్నవాళ్ళలో ప్రేమని నింపి, దానికున్న విలక్షణమైన గుణాలన్నీ సదరు బాధితుడికి అందిస్తూ..కర్మలను పూర్తిచేయిస్తూ విముక్తిడిని చెయ్యడమే గురు లక్షణం.

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే- ఆ కర్మలను పూర్తిచేసుకోవడం. అది ఏ కారణం చేతనైనా కుదరకపోయినా, ఏ బలవన్మరణాలవల్లనో మధ్యలో ఆగిపోయినా.. మళ్ళీ జన్మలో అవే సమస్యలు పున: ప్రారంభమై, గత జన్మలోని శత్రు శేషంచేతనే బాధింపబడవలసివుంటుందట. అందుకే.. ఏ కష్టమున్నా కూడా పంటి బిగువున పట్టి పూర్తిచెయ్యమంటారు. అందుకు తాను పూర్తి సహాయకారిగా ఉంటానంటారు. దానికి ప్రతిఫలం గా బాబాగారు మననుండి కోరుకునేది ఒక్కటే.. తన మీద శ్రద్ద, సబూరి. చూశారా? ఇంతకన్నా బరోసా ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా ఇవ్వగలరా ? ఒక్క బాబాగారు తప్ప !!!!!


Sunday, January 11, 2015

ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని?



మనిషికి, దేవునికి మధ్య వారధి గురువు. తన భారాన్ని తానే మోసుకుంటూ ఒకసారి వారధి వరకూ జాగ్రత్తగా వచ్చేస్తే అక్కడినుండి ఆ భారాన్ని గురువు మీద వేసేయవచ్చు. అప్పటికి గానీ గురువు కి మనమెవరమో తెలియదు అని “కాదు”. అలాగే తాను ఎన్ని అష్ట కష్టాలు పడుతూ, కోరుకున్న కోరికలు తీరక, అనుకున్నంత డబ్బురాక, కొందరిలా అన్నీ నాకెందుకు దొరకడం లేదు.. ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని? ఎప్పుడూ ఆందోళనే ఎప్పుడూ అసంతృప్తే… ఇలా మానవుని ఆలోచనలు పరిపరి విధాల పరిగెడుతూనే వుంటుంది. నిలబడి తన అలోచ నా సరళి సరళంగా గానీ లేదా న్యాయసమ్మతం గా గానీ లేదా చట్టబద్దం గా గానీ వుందా అని ఎప్పుడైనా ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు దొరక్కపోవు కదా?
బాబాగారికి భక్తులవ్వడానికి ముందు వారు ప్రత్యేక తరహాలో వివిధ అనుభవాలకు లోనవుతారు. విచిత్రం ఏమిటంటే కొంతమందిని బాబాయే వెతుక్కుని వెళతారు, పరిచయమూ చేసుకుంటారు. అది వారి పూర్వ జన్మ సుకృతం అనుకుంటా…..మరికొంతమంది విషయం లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళయందు బాధ్యత పడుతూ, వారికి తోడ్పడడానికి మరోక భక్తుని సహాయం తీసుకుంటారు. కానీ, అవసరానికి బాబా సహాయం పొందుతున్న వ్యక్తికి మాత్రం తెలియదు తాను ఎవరివల్ల సుఖపడుతున్నాడో. బాబాగారిని ఇంకా గుర్తించలేకపోవడము, బాబాకు దగ్గిర కాలేకపోవడము ఆ వ్యక్తి యొక్క దురదృష్ఠము, వెంటాడుతున్న ఖర్మము. మరి కొంతమంది విషయములో పరీక్షలు. ఆ పరీక్షల మూలం గా పాఠం నేర్చుకోవడం, బాబాను గుర్తించడము- అంటే అప్పటికి వారి ఖర్మము అలా నివృత్తి అయ్యి ఉంటుంది, బాబాని గుర్తించడం జరిగివుంటుంది. మరికొంత మంది బాబా యందు మూర్ఖత్వాన్ని చూపి.. పూర్తిగా నమ్మక… బాబాకు పరీక్షలు పెట్టి (భౌతికంగా లేకపోయినా) అంటే బాబా దగ్గిర చేసుకోవాలని చూస్తుంటారు.. వీళ్ళు మూర్ఖత్వంతో ఎడ్డె మంటే తెడ్డం అని మా అంతటివారు లేరు, అంతా మేమే అని పారిపోతుంటారు. అప్పుడది బాబా గారికి కష్టమిచ్చినట్లే. గురువుకి కూడా పరీక్షలే! ఆ మూర్ఖత్వం కూడా శాపకర్మమే. గురువు ఆ మూర్ఖత్వం మీద వర్క్ అవుట్ చేస్తే గాని ఆ సదరు వ్యక్తికి శాపవిమోచనమూ కాదు, గురువుకు దగ్గరనూ కాడు.
సోమదేవస్వామి అనే వ్యక్తి బాబాగారి మీద అనుమానపు దృష్ఠి తో (అంటే ఆయన నిజం గా యోగి యేనా అనేటటువంటి మీమాంస) షిర్డీ వచ్చాడుట . అతను షిరిడీ రాగానే ఇంకా బాబాను కలవడానికి ముందరే అంటే శిష్య వర్గాన్ని కలసిన తోడనే అతని మొదటి అనుభూతి- మన:శ్శాంతి, మానసిక ఉల్లాసము. ఇది బాబా గారి లక్షణము, ఆయన్ని నిరంతరం కొలిచేవారికి కూడా అదే లక్షణాన్ని బాబా ప్రసాదిస్తారు. అందుకే సోమదేవస్వామి కి అట్టి అనుభూతి. అనుమానం తో వచ్చిన వ్యక్తికి ఎన్నడూ అనుభూతి చెందని శాంతి, నిశ్చలత, ఉల్లాసము ఏల కలిగెను? అంటే ఆపాటివరకూ ఆయనకున్న కర్మం తొలగింది, తనను తాను గుర్తించడం మొదలు పెట్టాడు. క్రొత్తగా తనని తాను గుర్తించడం అనేది జరగడమే గురువు సంకల్పం. ఆ సంకల్పమే సోమదేవస్వామిని షిరిడీ రప్పించింది, అతని జీవితాన్ని మార్చింది.
ఈ లోపున సోమదేవస్వామికి తన మొదటి గురువు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి- “ఎచ్చట మనసు శాంతించి ఆనందం పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని. బాబాయందు తన మూర్ఖపు ఆలోచనలు వీడి వెంటనే సోమదేవస్వామి బాబాను తప్పక కలసి వెళ్ళాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం నుండి జ్ఞానోదయం కలగడం అంటే ఇదేనెమో? దీనికా దైవసంకల్పమూ, గురు బలమూ రెండూ లేకపోతే జరగనే జరగదు. తనను తాను తెలుసుకోకుండా, తన చుట్టు ప్రక్కల పరిస్థితులను అర్ధంచేసుకోకుండా, అర్ధం లేకుండా బ్రతికేయడం కూడా ఒక శాపం!